హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు అన్ని పార్టీల నేతలతో కలసి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడానికి తమకు అభ్యంతరం లేదని సీఎం రోశయ్య చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై జరిగిన చర్చకు చివర్లో ఆయన సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కే అవకాశాలపై అనుమానాలను వ్యక్తం చేసిన పలువురు సభ్యులు.. దీనిపై ప్రభుత్వం ప్రజలను, ఎమ్మెల్యేలను మభ్యపెడుతోందని విమర్శించారు.
ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల.. జాతీయ హోదాపై అనుమానాలు అక్కర్లేదని, త్వరలో సూత్రప్రాయంగా ఆమోదంతోపాటు ప్రధాని ప్యాకేజీ కింద రూ. 20వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత సీఎం స్పందిస్తూ.. ప్రధాని వద్దకు వెళ్లడానికి అభ్యంతరం లేదన్నారు.
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. దీనికి పొన్నాల బదులిస్తూ.. టెండర్లు పిలిచిన 28 ప్యాకేజీలనూ నాలుగేళ్లలో పూర్తి చేయడానికి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ రూపొందించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డిపిఆర్)ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా? అన్న టీడీపీ సభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నకు మం త్రి స్పందిస్తూ...'ఆ అవసరం లేదు. ఇందులో రహస్యమేమీ లేదు' అని బదులిచ్చారు.
అసలు ప్రాణహిత వంటి భారీ ఎత్తిపోతల పథకం అసంబద్ధమైనదని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు 3,750 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతుందని చెబుతున్నారని, ఇది సాధ్యమేనా అని ప్ర శ్నించారు.
బీజేపీ సభ్యుడు కిషన్రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు అంచనాలకు ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంపై సందేహాలను కొట్టిపారేసిన మంత్రి.. నిర్మాణం సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రాజెక్టు వ్యయంలో భాగంగానే ఉందన్న మంత్రి ఆ తర్వాత.. సభ్యుల అనుమానాలతో తన సమాధానాన్ని సవరించుకున్నారు.
జేపీ మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు నిర్వహణకు ఏటా 650 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందని, ఉత్పత్తి వ్యయం యూనిట్కు రూ. 3 అనుకున్నా, ఇందుకే రూ. 2వేల కోట్లు, అంటే ఎకరా ఆయకట్టుకు రూ. 16 వేల చొప్పున విద్యుత్కే ఖర్చవుతుందని వివరించారు. మంత్రి బదులిస్తూ నీటి కేటాయింపులను మాత్రమే వివరించారు.